హైదరాబాద్ : టీఎస్ ఐపాస్ లాగే భవన నిర్మాణ అనుమతుల కోసం త్వరలోనే టీఎస్ బీపాస్ తీసుకురానున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బి పాస్ కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షో 2020ను మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పలు చోట్ల అస్థిరత ఉన్నా తెలంగాణలో స్థిరమైన రాజకీయ వ్యవస్థ ఉందన్నారు. నాలుగేళ్ల క్రితమే బిల్డర్ల సమస్యలన్నీ సీఎం కేసీఆర్ పరిష్కరించారన్నారు. కార్యదక్షత, సమర్థత, విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ మనకు లభించడం తెలంగాణ రాష్ట్రం చేసుకున్న అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందన్నారు. 2014లో జేఎల్ఎల్ రేటింగ్స్లో హైదరాబాద్ టాప్-20లో లేదు. కానీ 2020లో 130 నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరగాలని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మీద మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాల పైనా నిర్మాణరంగ సంస్థలు దృష్టి పెట్టాలని కోరారు. మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మౌళిక వసతుల కోసం రూ.2,500 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని సూచించారు.
త్వరలో టీఎస్ బీపాస్ : మంత్రి కేటీఆర్